తిరుమల దర్శనాల పేరుతో మోసాలు.. భక్తులకు టీటీడీ హెచ్చరిక

  • తిరుమల దర్శనాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో మోసాలు
  • భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
  • అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన
  • మోసగాళ్ల సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ జారీ
  • తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
తిరుమల శ్రీవారి దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు సాగిస్తున్న మోసాల ఘటనలను టీటీడీ సీరియస్ గా తీసుకుంది. భక్తులను మాయమాటలతో నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

సోషల్ మీడియాలో "శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వర స్వామి దేవ‌స్థానం" అనే ఐడీతో భక్తులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను టీటీడీ విజిలెన్స్ విభాగం, పోలీసుల సమన్వయంతో అదుపులోకి తీసుకుంది. నిందితులను చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్నకేశ‌వులుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. ఎవరైనా దర్శనాలు, గదులు ఇప్పిస్తామని సంప్రదిస్తే, వెంటనే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నంబర్ 9866898630కు సమాచారం ఇవ్వాలని కోరింది.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సెంటర్ పనితీరును ఆమెకు వివరించారు.

భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగిస్తున్న "ప్రెడిక్టివ్ అనలిటిక్స్" టెక్నాలజీ గురించి తెలిపారు. లడ్డూ ప్రసాదం తయారీ, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, వసతి గదుల కేటాయింపు వంటి అన్ని విభాగాలను ఈ సెంటర్ ద్వారా ఎలా సమన్వయం చేస్తున్నారో వివరించారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న తీరును ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

TTD
Tirumala
TTD scams
Tirumala Darshan
Online booking
Sravan Kala Tirumala
Kamasani Pavan Kumar
Bodireddy Chennakesava
TTD Vigilance
Tirupati

More Telugu News